పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయఢంకా మోగించడంతో ఇప్పుడు అందరి దృష్టి సిఎం అభ్యర్థిపై పడింది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సిఎం కుర్చీ కోసం బిజెపిలో ప్రధానంగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో విపక్ష నేత సువేందు అధికారితో పాటు మరో నాయకుడు దిలీప్ ఘోష్ పేరు జోరుగా వినిపిస్తోంది. రేసులో మాత్రం సువేందు అధికారి మొదటి వరుసలో ఉన్నారు. మమతా బెనర్జీని ఆమె సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో సవాల్ చేసి, గట్టి పోటీని ఇచ్చారు. నందిగ్రామ్‌లో గతంలో మమతను ఓడించడం, రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలపై పట్టు, దూకుడుగా ఉండే రాజకీయ శైలి ఆయనకు కలిసొచ్చే అంశాలు. ఎన్నికల ప్రచారంలో హిందూ ఓట్ల ఏకీకరణలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇక బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత దిలీప్ ఘోష్ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి బలమైన పోటీదారుగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ఖరగ్‌పూర్ సదర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈయనకు ఆర్‌ఎస్‌ఎస్ అండదండలు ఉన్నాయి. ఇక స్థానిక నేతగా ప్రజల్లో ఆయనకున్న గుర్తింపు ఉంది.