వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే.. నేర్చుకోవాలనే తపన ఉంటే జీవితంలో ఎప్పుడైనా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించవచ్చని నిరూపించారు కేరళకు చెందిన కర్త్యాయిని అమ్మ. చిన్నతనంలో పేదరికం కారణంగా పాఠశాల ముఖం చూడలేకపోయిన ఆమె.. 96 ఏళ్ల వయసులో పరీక్ష రాసి ఏకంగా రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించారు.
కేరళలోని అలప్పుజ జిల్లా చెప్పాడ్కు చెందిన కర్త్యాయిని అమ్మ 1922లో జన్మించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో చిన్నతనంలోనే చదువుకు దూరమయ్యారు. జీవనం కోసం ఇంటిపనులు, దేవాలయాల్లో శుభ్రపరిచే పనులు చేస్తూ కాలం గడిపారు. చిన్న వయసులోనే వివాహం జరగడంతో కుటుంబ బాధ్యతలు కూడా ఆమెపై పడ్డాయి. ఆమెకు ఆరుగురు సంతానం.
అయితే చదువుకోవాలనే కోరిక మాత్రం ఆమె మనసులో ఎప్పుడూ ఉండేది. ఆ కోరికకు ఆమె కుమార్తె అమ్మిణియమ్మ విజయమే మళ్లీ ఊపిరి పోసింది. అమ్మిణియమ్మ కూడా చిన్నతనంలో చదువును మధ్యలోనే ఆపేశారు. అనంతరం నిరంతర విద్యా తరగతుల్లో చేరి పదో తరగతికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.
కుమార్తె విజయాన్ని చూసిన కర్త్యాయిని అమ్మలోనూ ఆత్మవిశ్వాసం పెరిగింది. ‘ఆమె చేయగలిగితే నేనెందుకు చేయలేను?’ అనే ఆలోచనతో 90 ఏళ్లు దాటిన తర్వాత చదువును ప్రారంభించారు.
96 ఏళ్ల వయసులో అద్భుత విజయం
2018లో కేరళ స్టేట్ లిటరసీ మిషన్ అథారిటీ నిర్వహించిన ‘అక్షరలక్షం’ అక్షరాస్యత పరీక్షకు కర్త్యాయిని అమ్మ హాజరయ్యారు. అప్పటికి ఆమె వయసు 96 సంవత్సరాలు. వేలాది మంది అభ్యర్థులు పాల్గొన్న ఈ పరీక్షలో చదవడం, రాయడం, గణితం వంటి అంశాల్లో వారి సామర్థ్యాన్ని పరీక్షించారు.
కర్త్యాయిని అమ్మ ఏకంగా 100 మార్కులకు 98 మార్కులు సాధించారు. పరీక్షకు హాజరైన 40,363 మంది అభ్యర్థుల్లో రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ సాధించారు. రాతలో 40కి 38 మార్కులు పొందగా.. చదవడం, గణితంలో పూర్తి మార్కులు సాధించారు.
ఈ అసాధారణ విజయంతో ఆమె దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆమెను ప్రత్యేకంగా అభినందించి సర్టిఫికెట్ అందించారు. అప్పటి విద్యాశాఖ మంత్రి సి. రవీంద్రనాథ్ కూడా ఆమెను కలిసి అభినందించి ల్యాప్టాప్ను బహుమతిగా ఇచ్చారు.
అంతటితో కర్త్యాయిని అమ్మ విద్యా ప్రయాణం ఆగలేదు. అనంతరం కేరళ స్టేట్ లిటరసీ మిషన్ నిర్వహించిన నాలుగో తరగతికి సమానమైన పరీక్షను కూడా విజయవంతంగా పూర్తి చేశారు.
దేశం గుర్తించిన ‘వృద్ధ విద్యార్థిని’
కర్త్యాయిని అమ్మ కథ క్రమంగా దేశవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా మారింది. ఆమెను కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ గుడ్విల్ అంబాసిడర్గా ఎంపిక చేశారు.
2020 మార్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారం అందుకున్నారు. ఆమె పట్టుదల, విద్యపై ఉన్న ఆసక్తికి జాతీయ స్థాయిలో ఈ గౌరవం లభించింది.
అంతేకాదు.. కేరళకు సంబంధించిన ‘నారీ శక్తి అండ్ ఫోక్ ట్రెడిషన్స్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్’ శకటంలోనూ కర్త్యాయిని అమ్మకు ప్రత్యేక స్థానం కల్పించారు.
101 ఏళ్ల వయసులో కన్నుమూత
విద్య ద్వారా ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన కర్త్యాయిని అమ్మ 2023 అక్టోబర్ 10న 101 ఏళ్ల వయసులో కన్నుమూశారు. స్ట్రోక్ కారణంగా కొంతకాలంగా మంచానికే పరిమితమైన ఆమె తుదిశ్వాస విడిచారు.
ఆమె మరణంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. కర్త్యాయిని అమ్మను ‘కేరళ గర్వకారణం’గా అభివర్ణించారు. కేరళ అక్షరాస్యత ఉద్యమానికి ఆమె మరణం తీరని లోటని పేర్కొన్నారు.
వయసు అడ్డంకి కాదని నిరూపించిన అమ్మమ్మ
కర్త్యాయిని అమ్మ జీవితం ఒక గొప్ప సందేశాన్ని చెబుతుంది. చిన్నతనంలో పాఠశాలకు వెళ్లలేకపోయినా.. 96 ఏళ్ల వయసులో పుస్తకం పట్టుకుని పరీక్ష రాసి రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ సాధించారు.
చదువుకోవడానికి వయసు అడ్డంకి కాదు.. సాధించాలనే సంకల్పం ఉంటే ఎప్పుడైనా కొత్త ఆరంభం చేయవచ్చు అని తన జీవితంతో ప్రపంచానికి చాటి చెప్పారు. కర్త్యాయిని అమ్మ భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆమె కథ మాత్రం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలిచిపోతుంది.












