
మన తెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయ యాంత్రీకరణ పథకంల కింద రైతులకు అందించే సబ్సిడీ నిధులను ఈ సారి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, సహకార శాఖల పరిధిలోని పలు అంశాలపై ఉన్నతాధికారులతో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేయడంతో పాటు, సాగు ఖర్చులను తగ్గించేందుకు అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకంపై మంత్రి సమీక్షించారు. ఈ పథకం కింద రైతులకు అందించాల్సిన వ్యవసాయ పనిముట్లను ఖరారు చేసినట్లు మంత్రి తెలిపారు. రైతుల అవసరాలకు అనుగుణంగా పనిముట్ల ఎంపిక చేసి, వాటి పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని, మధ్యవర్తిత్వానికి అవకాశం లేకుండా, పారదర్శకంగా లబ్ధిదారులకు ప్రయోజనం అందేలా వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు.
యాంత్రీకరణ పథకంలో పనిముట్లు సరఫరా చేసే సంస్థల ఎంప్యానెల్మెంట్ ప్రక్రియను హాకా అధికారులు పరిశీలిస్తున్నారని మంత్రి తెలిపారు. నాణ్యత, ధర, రైతులకు అందుబాటు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంప్యానెల్ లిస్టును త్వరగా ఖరారు చేయాలని సూచించారు. రాష్ట్రంలో యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఫెర్టిలైజర్ యాప్లో మ్యాపింగ్ ఆలస్యం తదితర కారణాలతో వచ్చే సమస్యలను కేంద్ర అధికారులతో మాట్లాడి అదే రోజు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ను మంత్రి ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం యూరియాకే కాకుండా కాంప్లెక్స్ ఎరువులకు కూడా సబ్సిడీ ఇవ్వాలని మంత్రి తుమ్మల కోరారు. యూరియాకు సబ్సిడీ ఇచ్చి, ఇతర ఎరువులకు తగిన సబ్సిడీ లేకపోవడంతో రైతులు తక్కువ ధరలో లభించే యూరియాను అధికంగా వినియోగించే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఎరువుల ధరల విధానాన్ని సమతుల్యంగా రూపొందించాలని, అన్ని రకాల ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించే విధంగా సబ్సిడీ విధానం ఉండాలలన్నారు. రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగు విస్తరణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
దరఖాస్తు చేసుకున్న రైతులకు మొక్కలు లేవనే సమాధానం రాకూడదని, రెండు మూడు రోజుల్లోనే మొక్కలు అందేలా సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు. నర్సరీల్లో నిర్ణయించిన లక్ష్యానికి కనీసం రెండింతల సంఖ్యలో మొక్కలను సిద్ధం చేయాలని, అన్ని శాఖల వద్ద ఉన్న భూముల వివరాలను తెప్పించుకొని, నర్సరీలకు భూమి అవసరమైతే ఇతర శాఖల ఖాళీ స్థలాలను లీజు ప్రాతిపదికన వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ సెక్రటరీని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2600 రైతు వేదికలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని, అన్ని రైతు వేదికలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసేలా, దశలవారీగా అమలు కార్యాచరణను రూపొందించి, వాటిని 2, 3 నెలల్లో పూర్తి చేయాలలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నోడల్ సంస్థగా ఉన్న హాకా, రెడ్కో కమిషనర్తో సమన్వయం చేసుకుని రైతు వేదికలపై సోలార్ ప్యానెల్స్ త్వరగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని హాకా ఎండిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, కోఆపరేషన్ స్పెషల్ కమిషనర్ రాహుల్ రాజ్, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ భాషా, హాకా ఎండీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.











