ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇటీవల హల్ద్వానీలో పాల్గొన్న ర్యాలీ ప్రదేశంలో నిర్వహించిన ‘శుద్ధీకరణ’ కార్యక్రమంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటన ఒక నేరమని, దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశించాలని డిమాండ్ చేశారు. శనివారంనాడిక్కడ జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ, క్యాంగ్రెస్ అధ్యక్షుడికి న్యాయం చేయాలని తాము కోరుతున్నట్టు చెప్పారు. ఈ ఘటన బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనా విధానాన్ని స్పష్టంగా తెలియజేస్తోందన్నారు. దళితులు అభివృద్ధి చెందడం, గౌరవంగా జీవించడం, విజయాలు సాధించడం వారికి ఇష్టం లేదని ఆరోపించారు. ‘ఉత్తరాఖండ్‌లో జరిగిన ఘటనకు కాంగ్రెస్ అధ్యక్షుడికి న్యాయం చేయండి. ఆ విధంగా చేయాల్సిన బాధ్యత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది’ అని అన్నారు.