
వైసీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు నగరంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం అంబటి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం వెంటనే హైదరాబాద్కు తీసుకువచ్చారు. అపోలో ఆసుపత్రిలో చేరిన వెంటనే వైద్య బృందం ఆయనకు పలు వైద్య పరీక్షలు నిర్వహించింది. యాంజియోగ్రామ్ చేసి, ఆయనకు స్టెంట్ వేయాలని నిర్ణయించారు. ఆ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం అంబటి రాంబాబు వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు వెల్లడించారు. విషయం తెలియగానే వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.











