
లెక్కల శాస్త్రం గెలిచిందన్న మై యాక్సిస్ ప్రదీప్
తమిళనాడు ఎన్నికల ఫలితాలపై తాజా స్పందన
టివికె తొలి ఓటు బ్యాంకులు అత్యంత గణనీయం
న్యూఢిల్లీ ః తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ పార్టీ టివికె గెలుస్తుందని తాము చెపితే అందరూ నవ్వారని యాక్సిస్ మై ఇండియా సంస్థ చీఫ్ ప్రదీప్ గుప్తా తెలిపారు. ఇప్పుడు నవ్విన నాపచేసే పండినట్లు అయిందని సోమవారం ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో అనూహ్య రీతిలో టివికె విజయం సాధించడంపై గుప్తా స్పందించారు. పలు ఇతర సంస్థలు ఈ ఎన్నికల్లో తమిళనాడులో డిఎంకె కూటమి గెలుస్తుందని, అన్నాడిఎంకె గట్టి పోటీ ఇస్తుందని విశ్లేషించాయి. అయితే ఒక్క యాక్సిస్ మై ఇండియానే ఇందుకు భిన్నంగా విజయ్దే గెలుపు అని స్పష్టం చేసింది. ఇది జోస్యం అనుకునేరు. లెక్కలు గణాంకాల శాస్త్రం దక్కించుకున్న విజయం అని గుప్తా తెలిపారు.
234 స్థానాల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈసారి కూడా డిఎంకెకు పెద్దగా పోటీ ఉండబోదని పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ సర్వేల దశలో తెలిపాయి. అయితే యాక్సిస్ మై ఇండియా ఒక్కటే విజయ్ తొలి ప్రవేశంతోనే అద్భుతాలు సృష్టిస్తాడని, టివికెకు 98 నుంచి 120 వరకూ స్థానాలు వస్తాయని తెలిపింది. తాము అప్పుడు వెలువరించిన విశ్లేషణను ఇప్పుడు గుప్తా మరో సారి పొందుపర్చారు. డిఎంకె, అన్నాడిఎంకెలకు ఇప్పుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా, ఈ పార్టీల ప్రాబల్యాన్ని దెబ్బతీసింది. ఎన్నికల తరువాతి ఓట్ల లెక్కింపు దశలో కీలకమైన డాటా సైన్స్ ఉంటుంది. ఇప్పుడు తాము ముందుగా ఇక్కడ గెలుపు అంచనా వేసింది ఈ డాటా సైన్స్ ప్రాతిపదికనే అని తేల్చిచెప్పారు.
విజయ్ పార్టీ గెలవడటం ఏమిటీ? కుదరదు అని చాలా మంది కొట్టి పారేశారు. ఇదంతా అలాటప్పా సర్వే అన్నారు. రాజకీయ పండితులు, పరిశీలకులు ఇతర పోల్ సంస్థ లు యాక్సిస్ ఇండియా పట్ల చులకన భావంతో మాట్లాడరని , అయితే ఇప్పుడు తాము చెప్పిన దానికి అనుగుణంగానే విజయ్ విజయం సాధించారని తెలిపారు. డిఎంకెకు సీట్లు, ఓట్లశాతం పై కూడా తాము ఖచ్చితంగానే తెలిపామని గుర్తు చేశారు. విజయ్ పార్టీకి 35 శాతం ఓటు వాటా ఉంటుందని చెప్పామని, ఇది నిజం అయిందని తెలిపారు. అన్నాడిఎంకెకు తాము 23 శాతం అంచనా వేశామని , ఇది ఇప్పుడు 27 శాతంగా ఉందని తెలిపారు. అయితే శేఖర్ గుప్తా ఇప్పుడు తమ విశ్లేషణలో తప్పటడుగు వేశారు. విజయ్ తరువాతి స్థానంలో స్టాలిన్ డిఎంకె ఉంటుందని, మూడో స్థానంలో అన్నాడిఎంకె నిలుస్తుందని చెప్పారు. అయితే పలితాల క్రమంలో రెండో నెంబరులో అన్నాడిఎంకె కూటమి, మూడో వరుసలో డిఎంకె మిత్రపక్షాలు నిలిచాయి.












