వినాయక చవితి వేడుకలకు సన్నాహాలు జరుగుతున్న వేళ తెలంగాణలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ ధూల్పేట్ నుంచి సిద్దిపేటకు తరలిస్తున్న భారీ గణేష్ విగ్రహం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా దెబ్బతింది.
వివరాల ప్రకారం.. సిద్దిపేటకు చెందిన కొందరు యువకులు వినాయక ఉత్సవాల కోసం హైదరాబాద్లోని ధూల్పేట్ ప్రాంతం నుంచి భారీ గణేష్ విగ్రహాన్ని కొనుగోలు చేశారు. అనంతరం విగ్రహాన్ని లారీపై ఎక్కించి సొంత ప్రాంతానికి తరలిస్తున్నారు.
లారీ ప్రజ్ఞాపూర్ ప్రాంతానికి చేరుకున్న సమయంలో ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న ఓ భారీ సైన్బోర్డు విగ్రహానికి తగిలే అవకాశం ఉందని డ్రైవర్ గుర్తించాడు. దీంతో బోర్డును తొలగించే వరకు లారీని రోడ్డుపక్కన నిలిపినట్లు సమాచారం.
అయితే అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ నిలిపి ఉన్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి గణేష్ విగ్రహాన్ని తరలిస్తున్న లారీ కదలడంతో దానిపై ఉన్న భారీ విగ్రహం కిందపడిపోయింది.
కిందపడిన విగ్రహం తీవ్రంగా దెబ్బతిని ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో మరో కారు కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. విగ్రహాన్ని తరలిస్తున్న వాహనం డ్రైవర్కు స్వల్ప గాయాలైనట్లు, పెద్దగా ప్రాణనష్టం జరగలేదని తాజా నివేదికలు పేర్కొన్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్రేన్ సాయంతో రోడ్డుపై ఉన్న వాహనాలను, ధ్వంసమైన గణేష్ విగ్రహాన్ని పక్కకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
భారీ విగ్రహాల తరలింపుపై జాగ్రత్తలు
ఈ ఘటన భారీ గణేష్ విగ్రహాలను తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరోసారి దృష్టి పెట్టేలా చేసింది. ఫ్లైఓవర్లు, సైన్బోర్డులు, విద్యుత్ వైర్లు, చెట్ల కొమ్మలు వంటి అడ్డంకులను ముందుగానే గుర్తించి రూట్ను పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
అలాగే భారీ విగ్రహాలను తరలించే సమయంలో వాహనం ఎత్తు, రహదారి పరిస్థితులు, ట్రాఫిక్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.












