
రాష్ట్ర పోలీసులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పుట్టినరోజు, వివాహవార్షికోత్సవ రోజు సెలవులకు అనుమతిస్తున్నట్లు సోమవారం రాష్ట్ర డిజిపి శివధర్రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిరంతరం క్షేత్రస్థాయిలో ఒత్తిడికి గురయ్యే పోలీస్ సిబ్బందికి ఉపశమనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. సిబ్బంది పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం రోజున కుటుంబసభ్యులతో గడిపేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పోలీసులు కఠినతరమైన విధులు నిర్వహిస్తూ సమాజ భద్రత కోసం వ్యక్తిగత జీవితాన్ని ధారపోస్తారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కానిస్టేబుల్ నుంచి ఉన్నతాస్థాయి అధికారుల వరకు ఈ నిబంధన వర్తిస్తుందని, సెలవులు దరఖాస్తుకు ముందుగా సర్వీస్ రిజిస్ట్రర్లో అందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని జత చేయాలని తెలియజేశారు. అత్యవసర పరిస్థితుల మినహ సెలవులను మంజూరు చేయాలని యూనిట్ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
















