
ఇవిఎంల కబ్జాకు దిగిన బిజెపి
వీడియో విడుదల చేసిన టిఎంసి
స్ట్రాంగ్ రూంలో దర్జాగా ఓట్ల తారుమారు?
కేంద్రం, ఎన్నికల సంఘం కుమ్మక్కు
స్టేడియం వద్దకు పార్టీ నేతలు కార్యకర్దల దండు
అధినేత్రి మమత కూడా రంగంలోకి?
కోల్కతా ః కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తీవ్రస్థాయి ఎన్నికల ద్రోహానికి పాల్పడిందని టిఎంసి గురువారం ఆరోపించింది. లెక్కింపునకు సిద్ధంగా భద్రపర్చి ఉన్న బ్యాలెట్ బాక్స్లను స్ట్రాంగ్ రూంలలో బిజెపి తెరిచిందని పేర్కొంటూ టిఎంసి తాజాగా ఓ వీడియోను మీడియాకు విడుదల చేసింది. ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలనే తాపత్రయంతో బిజెపి ఇప్పుడు ఏకంగా ఇవిఎంలకు తూట్లు పొడిచిందని టిఎంసి వర్గాలు దుయ్యబట్టాయి, ఇవిఎంల టేంపిరంగ్ పెద్ద ఎత్తున జరుగుతోందని ఆరోపించారు. తమ దృష్టికి వచ్చిన ఈ ఇవిఎంల ఓపెన్ వీడియోను ప్రజల ముందుకు మీడియా ద్వారా తీసుకువస్తున్నట్లు టిఎంసి ఘాటైన పదజాలంతో ఎక్స్ సామాజిక మాధ్యమంలో వీడియోను పొందుపర్చింది.
బిజెపి, కేంద్ర ఎన్నికల సంఘం కుమ్మక్కు అయ్యాయని, ఈ తతంగం ఇప్పటి ఘటనతో పరాకాష్టకు చేరిందని విమర్శించారు. సర్తో ముందస్తు ఓట్ల చోరీకి దిగారు. ఇప్పుడు టేంపరింగ్తో తీర్పును ధ్వంసం చేస్తున్నారని టిఎంసి ఆరోపించింది. ఓడిపోతామనే భయం పట్టుకున్న బిజెపి ఇటువంటి నిరాశానిస్పృహ పనులకు దిగిందని తెలిపారు. స్ట్రాంగ్రూంలలో బ్యాలెట్ బ్యాక్స్లు తెరవాలంటే సంబంధిత అన్ని రాజకీయ పార్టీలు, ఇతర ప్రతినిధుల సమక్షంలో జరగాల్సి ఉంది.
అయినా కౌంటింగ్కు ముందు నిబంధనల మేరకు ఇది జరగాల్సి ఉంది. ఈ లోగానే బ్యాలెట్ బాక్స్లు తెరవడం అంటే బిజెపి ఎంతగా దిగజారిందనేది తేటతెల్లం అయిందని టిఎంసి దాడికి దిగింది. మే 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల దశలో టిఎంసి ఆరోపణ ప్రభావం ఏమిటీ? దీనిపై బిజెపి, ఇసి నుంచి ఎటువంటి తరువాతి స్పందన ఉంటుందనేది వెల్లడికావాల్సి ఉంది. ప్రస్తుత పరిణామంపై టిఎంసి వర్గాలు క్రమేపీ రంగంలోకి దిగుతున్నాయి. సీనియర్ టిఎంసి నేత శశి పంజా , కునలా ఘోష్లు ఈ ఘటన జరిగిందని చెపుతున్న స్థానిక నేతాజీ ఇండోర్ స్టేడియం వెలుపల పార్టీ కార్యకర్తలతో కలిసి గుమికూడారు.
ఈ చోటుకు రావడానికి పార్టీ అధినేత్రి మమత బెనర్జీ సిద్ధపడ్డట్లు వెల్లడైంది. ఆమె అక్కడికి వెళ్లి పరిస్థితి స్వయంగా సమీక్షిస్తారని సమాచారం అందింది. పలు ఎగ్జిట్ పోల్స్లలో టిఎంసి ఓడిపోతోందని, తొలిసారిగా రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రానుందని వెల్లడైంది ఈ దశలో ఎన్నికల ఓటింగ్ యంత్రాల తారుమారు లేదా, ఫలితాల వక్రీకరణ జరుగుతోందని టిఎంసి ఆరోపించడం, వీడియో విడుదల చేయడం కీలక రాజకీయ దుమారం అయింది.
..................................















