ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌–ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. కారణం మైదానంలో ఆటగాళ్లు మాత్రమే కాదు… స్టాండ్స్‌లో కనిపించిన భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.

ఎన్నో రోజుల తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌కు హాజరైన గంభీర్… భారత్ సెలెక్టర్ ఆర్‌పీ సింగ్‌తో కలిసి మ్యాచ్‌ను ఆసక్తిగా వీక్షించారు. ఈ ఇద్దరూ చాలా సేపు లోతైన చర్చల్లో మునిగిపోవడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. భవిష్యత్ భారత జట్టుకు సంబంధించిన వ్యూహాలపైనా… యువ ఆటగాళ్ల ఎంపికపైనా చర్చ జరిగిందా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

అంతేకాదు… బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాతో కూడా గంభీర్ ప్రత్యేకంగా మాట్లాడటం మరింత చర్చనీయాంశమైంది. ఐపీఎల్ 2026లో మెరిసే యువ ప్రతిభపై సెలెక్టర్లు ఇప్పటికే నిఘా పెట్టగా… గంభీర్ ప్రత్యక్షంగా మ్యాచ్‌కు రావడం వెనుక ప్రత్యేక కారణాలున్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

గతంలో 2024లో కేకేఆర్ మెంటర్‌గా జట్టును మూడో టైటిల్‌ దాకా తీసుకెళ్లిన గంభీర్… ఆ తర్వాత తొలిసారి ఐపీఎల్ మ్యాచ్‌లో కనిపించడం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పుడు ఆయన చూపు ఎవరిపై పడిందో… టీమిండియాకు కొత్త తారలు ఎవరో అన్న ఉత్కంఠ క్రికెట్ వర్గాల్లో నెలకొంది.