ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించేందుకు గుజరాత్ ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ కార్యక్రమం మంచి ఫలితాలను అందిస్తోంది. ‘సుగమ్ డిజిటల్ గుజరాత్’ పోర్టల్ ద్వారా పౌరులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంటి నుంచే పలు ముఖ్యమైన సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకుని పొందుతున్నారు.
గత నాలుగు నెలల్లోనే లక్ష మందికి పైగా పౌరులు ఈ డిజిటల్ సేవలను వినియోగించుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
7 రకాల సర్టిఫికెట్లు ఆన్లైన్లో
ప్రస్తుతం ఈ పోర్టల్ ద్వారా మొత్తం ఏడు ముఖ్యమైన ధ్రువపత్రాలను ఆన్లైన్లో పొందే అవకాశం ఉంది.
వాటిలో:
సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల (SEBC) సర్టిఫికెట్
నాన్-క్రీమీ లేయర్ సర్టిఫికెట్
ఆర్థికంగా బలహీన వర్గాల (EWS) సర్టిఫికెట్
అన్రిజర్వ్డ్ కేటగిరీ సర్టిఫికెట్
మతపరమైన మైనారిటీ సర్టిఫికెట్
సంచార, డీనోటిఫైడ్ తెగల సర్టిఫికెట్
ఆదాయ ధ్రువపత్రం
ఉన్నాయి.
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు
డిజిటల్ విధానంలో అర్హత కలిగిన పౌరులు ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలను అధికారులు పరిశీలించిన తర్వాత e-Signతో డిజిటల్ సర్టిఫికెట్ జారీ చేస్తారు.
ఈ సర్టిఫికెట్లను వాట్సాప్, డిజిలాకర్ వంటి డిజిటల్ ప్లాట్ఫారమ్లలో కూడా పొందే అవకాశం ఉండటంతో.. అవసరమైనప్పుడు సులభంగా ఉపయోగించుకోవచ్చు.
విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఎంతో ఉపయోగం
ఈ సేవ ముఖ్యంగా విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతకు ప్రయోజనకరంగా మారనుంది.
కాలేజీ అడ్మిషన్లు, స్కాలర్షిప్లు, ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియల్లో అవసరమైన కుల, ఆదాయ, EWS తదితర సర్టిఫికెట్లను ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్లైన్లో పొందవచ్చు.
పారదర్శకత, వేగవంతమైన సేవలే లక్ష్యం
డిజిటల్ విధానం ద్వారా పేపర్వర్క్ తగ్గించడం, ప్రక్రియను వేగవంతం చేయడం, పరిపాలనా ఆలస్యాలను తగ్గించడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని ప్రభుత్వం చెబుతోంది.
ప్రజల నుంచి తొలి నాలుగు నెలల్లోనే వచ్చిన స్పందనతో డిజిటల్ ప్రభుత్వ సేవలకు మంచి ఆదరణ లభిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
డిజిటల్ సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచన
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించకుండా ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సేవలను ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.












