
న్యూఢిల్లీ: 'వికసిత్' (అభివృద్ధి చెందిన) దేశంగా మారాలంటే.. భారత్ 'మాదకద్రవ్య రహిత' దేశంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం 137వ 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా జాతిని ఉద్దేశించి పిఎం మోడీ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తును కాపాడటమే ప్రభుత్వ సంకల్పమని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన 'వికసిత్ భారత్ కోసం నషా-ముక్త్ యువ' ప్రచారాన్ని ఆయన ప్రశంసించారు. ఇందులో పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా యువత చురుకుగా పాల్గొంటున్నారని ఆయన తెలిపారు.
డ్రగ్స్ ఫ్రీ యువత, భారతదేశమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రధాని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల వ్యసనానికి వ్యతిరేకంగా, యువత వాటికి ఎందుకు దూరంగా ఉండాలనే సందేశాన్ని వివిధ భాషల్లో వ్యాప్తి చేయాలని ఆయన కంటెంట్ క్రియేటర్లను కోరారు.
"మాదక ద్రవ్యాల వ్యసనం మొత్తం కుటుంబాలను, సమాజాన్ని కబళిస్తుంది. దానికి వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ, వ్యసనంతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చే వారిని నేను అభినందిస్తున్నాను. మాదక ద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలను ఎత్తిచూపుతూనే, వాటి నుండి కోలుకునే మార్గాన్ని కూడా చూపించే శక్తివంతమైన నినాదాలు, పాటలు, లఘు నాటకాలను మీరు రూపొందించగలరా?" అని మోడీ కంటెంట్ క్రియేటర్లను కోరారు.











