
స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం దిశగా భారతదేశం అడుగులు వేస్తోంది. తాజాగా సాంకేతిక రంగంలో భారత్ మరో కీలక మైలురాయిని అధిగమించింది. పుణేకు చెందిన నిబే సంస్థ అభివృద్ధి చేసిన ‘వాయు అస్త్ర-1’ లోయిటరింగ్ మ్యూనిషన్ వ్యవస్థ రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో విజయవంతంగా సాంకేతిక పరీక్షలను పూర్తి చేసింది. ఈ పరీక్షలను భారత సైన్యానికి చెందిన సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తల సమక్షంలో నిర్వహించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా స్వదేశీ రక్షణ తయారీ, ఖచ్చితమైన దాడి సామర్థ్యాల అభివృద్ధిలో ఇది మరో ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు.
భారత సైన్యం 100 కిలోమీటర్ల పరిధిలో గల లోయిటరింగ్ మ్యూనిషన్ వ్యవస్థ కోసం జారీ చేసిన ఆర్ఎఫ్పీకి స్పందనగా ఈ ప్రదర్శన నిర్వహించారు. పరీక్షల సమయంలో ‘వాయు అస్త్ర-1’ 10 కిలోల వార్హెడ్తో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఒక్క ప్రయత్నంలోనే విజయవంతంగా ధ్వంసం చేసింది. ఈ వ్యవస్థ ఒక మీటర్ కంటే తక్కువ సీఈపీ (సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబుల్) ఖచ్చితత్వాన్ని సాధించిందని సంస్థ వెల్లడించింది. దీంతో అత్యంత ఖచ్చితమైన దాడులు చేయగల సామర్థ్యం దీనికి ఉన్నట్లు నిరూపితమైంది. అలాగే అబోర్ట్ అటాక్, రీ-అటాక్ సామర్థ్యం, తెలివైన లక్ష్య గుర్తింపు వ్యవస్థలు వంటి ఆధునిక సాంకేతిక లక్షణాలను కూడా ఈ పరీక్షల్లో విజయవంతంగా ప్రదర్శించారు. భవిష్యత్ యుద్ధ అవసరాలకు ఇవి కీలకమని రక్షణ నిపుణులు చెబుతున్నారు.
ఇజ్రాయెల్కు చెందిన ఆధునిక లోయిటరింగ్ మ్యూనిషన్ సాంకేతికత ఆధారంగా ఈ వ్యవస్థను అభివృద్ధి చేసి, భారత సైన్య అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆధునిక యుద్ధాల్లో లోయిటరింగ్ మ్యూనిషన్ల ప్రాధాన్యం వేగంగా పెరుగుతోంది. లక్ష్య ప్రాంతంపై గాల్లోనే తిరుగుతూ శత్రు కదలికలను గుర్తించి, అత్యంత ఖచ్చితంగా దాడి చేయగలగడం వీటి ప్రత్యేకతగా భావిస్తున్నారు. పోఖ్రాన్ పరీక్షల్లో భాగంగా మరో కీలక విజయాన్ని కూడా సంస్థ నమోదు చేసింది. ఇన్ఫ్రారెడ్ కెమెరా ఆధారిత లక్ష్య వ్యవస్థతో రాత్రి సమయంలో యాంటీ-ఆర్మర్ దాడి నిర్వహించి, రెండు మీటర్ల కంటే తక్కువ సీఈపీ ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ధ్వంసం చేసింది.
ఇంకా గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫార్వర్డ్ కంట్రోల్ స్టేషన్కు ఆయుధ నియంత్రణను విజయవంతంగా బదిలీ చేసే సామర్థ్యాన్ని కూడా పరీక్షల్లో ప్రదర్శించారు. ఇది యుద్ధరంగంలో సౌలభ్యం, పరిధి, భద్రతను మరింత పెంచుతుందని రక్షణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల దీర్ఘశ్రేణి ‘సూర్యాస్త్ర’ రాకెట్ వ్యవస్థ విజయవంత పరీక్షల అనంతరం ‘వాయు అస్త్ర-1’ సాధించిన విజయం భారత స్వదేశీ రక్షణ సాంకేతిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నదానికి మరో నిదర్శనంగా భావిస్తున్నారు. ప్రైవేట్ భారతీయ రక్షణ సంస్థలు దేశ స్వావలంబనలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.











