అమరావతి: అనుమానంగా సంచరిస్తున్న యువకులను వివరాలు అడిగినందుకు కానిస్టేబుల్‌పై కత్తితో ఆగంతకులు దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... యర్నగూడెం వంతెన వద్ద ఆయిల్ ట్యాంకర్‌ను లారీ ఢీకొట్టింది. కానిస్టేబుల్ వెంకటేశ్వర రావు, లోవరాజు అక్కడి చేరుకొని ట్రాఫిక్‌కు క్లియర్ చేస్తున్నారు. అప్పుడే నలుగురు యువకుడు అక్కడ అనుమానాస్పదంగా తిరగడంతో కానిస్టేబుల్ వారిని వివరాలు అడిగాడు. బ్యాగులో నుంచి కత్తి తీసి కానిస్టేబుల్‌ను రెండు సార్లు పొడిచారు. అనంతరం నలుగురు బైక్‌ల మీద పారిపోయారు. వెంటనే కానిస్టేబుల్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అదే ప్రాంతంలో ఉన్న కనకదుర్గ ఆలయంలో చోరీ జరిగిందని గ్రామస్థులు గుర్తించారు. కానిస్టేబుల్‌పై దాడి, ఆలయంలో చోరీ ఘటనలు ఒకే సారి జరగడంతో నలుగురు యువకులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్‌పి నరసింహకిశోర్ ప్రైవేటు ఆస్పత్రికి చేరుకొని కానిస్టేబుల్‌ను పరామర్శించారు.