
ఒడిశాలో మాజీ సిఎం నవీన్ పట్నాయక్ పార్టీ బిజెడి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపి దేబాశిష్ సమంతరాయ్ సోమవారంనాడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపి పదవికి రాజీననామా చేశారు. సంబంధిత లేఖను నవీన్ పట్నాయక్కు పంపారు. పార్టీలో తనకు తగినంత గుర్తింపు లేకపోవడం, తన సేవలు పార్టీకి అంతగా అవసరం లేకపోవడంతో రాజీనామా చేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. నవీన్ పట్నాయక్కు అత్యంత సన్నిహితుడుగా సమంతరాయ్కి పేరుంది. సమంతరాయ్ కంటే ముందు జెడియు రాజ్యసభ సభ్యులు సుజీత్ కుమార్, మమతా మహంతలు ఇటీవల రాజీనామా చేశారు. అనంతరం బిజెపి టిక్కెట్పై ఇద్దరూ రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాగా, సమంతరాయ్ బిజెపిలో చేరే అవకాశాలున్నాయని, ఆయన చేరగానే పార్టీ మద్దతుతో తిరిగి రాజ్యసభకు ఎన్నికవుతారని తెలుస్తోంది.












