యామ్‌స్టెల్‌వీన్‌లోని వాగ్నర్ హాకీ స్టేడియంలో జరిగిన పురుషుల హాకీ ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత జట్టు 1-3 తేడాతో ప్రపంచ నంబర్‌వన్ నెదర్లాండ్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈ విజయంతో నెదర్లాండ్స్ సెమీఫైనల్‌కు అర్హత సాధించగా.. భారత్ సెమీఫైనల్ రేసులో క్లిష్ట పరిస్థితుల్లో నిలిచింది.

తొలి అర్ధభాగంలో నెదర్లాండ్స్ వరుసగా పెనాల్టీ కార్నర్‌లు సాధించినప్పటికీ గోల్ చేయలేకపోయింది. భారత్ కూడా ఫీల్డ్ గోల్ అవకాశాలు సృష్టించినా స్కోరు సాధించలేకపోయింది.

41వ నిమిషంలో డూకో టెల్జెన్‌క్యాంప్ నెదర్లాండ్స్‌కు తొలి గోల్ అందించాడు. 49వ నిమిషంలో హెడెమేకర్స్ ఫీల్డ్ గోల్‌తో ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. 51వ నిమిషంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్‌కు ఆశలు కల్పించాడు. అయితే 53వ నిమిషంలో వాన్ డామ్ మరో గోల్ చేయడంతో నెదర్లాండ్స్ 3-1 ఆధిక్యంలోకి వెళ్లింది. చివరికి అదే స్కోరుతో మ్యాచ్ ముగిసింది.

భారత్ సెమీఫైనల్ చేరాలంటే ఆగస్టు 24న అర్జెంటీనాతో జరిగే మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. కనీసం ఆరు గోల్స్‌కు పైగా తేడాతో అర్జెంటీనాను ఓడించడంతో పాటు.. ఇంగ్లాండ్ తన తర్వాతి రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడే భారత్‌కు సెమీఫైనల్ అవకాశాలు మెరుగుపడతాయి.