హాకీ ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం సౌతాఫ్రికాతో జరిగిన పూల్-డి మ్యాచ్‌లో భారత్ 6-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది.

ఒలింపిక్ రజత పతక విజేత చైనాతో జరిగిన తొలి మ్యాచ్‌ను 2-2తో డ్రాగా ముగించిన భారత్.. సౌతాఫ్రికాపై మాత్రం ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. 11వ నిమిషంలో సునేలిత గోల్ చేసి భారత్‌కు శుభారంభం అందించింది. 17వ నిమిషంలో నవ్‌నీత్ కౌర్, 25వ నిమిషంలో సుశీలా చాను గోల్స్ చేయడంతో తొలి అర్ధభాగంలో భారత్ 3-0 ఆధిక్యంలో నిలిచింది.

రెండో అర్ధభాగంలోనూ భారత మహిళలు జోరు కొనసాగించారు. 38వ నిమిషంలో దీపిక, 44వ నిమిషంలో లాల్‌రెమ్సియామి, 45వ నిమిషంలో సాక్షి రాణా గోల్స్ సాధించారు. సౌతాఫ్రికా తరఫున కైలా డి వాల్ ఏకైక గోల్ చేసింది.

చివరి వరకు ఆధిపత్యం కొనసాగించిన భారత జట్టు 6-1తో సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించి ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని అందుకుంది.