మహిళలపై సమాజంలో కొనసాగుతున్న వ్యవస్థాగత నియంత్రణ, అణచివేత, హింస వంటి అంశాలపై నిర్వహించిన ఇంటరాక్టివ్ చర్చలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళల భద్రత పేరుతో విధించే ఆంక్షలు, వారి స్వేచ్ఛను పరిమితం చేసే పరిస్థితులు చివరకు అణచివేతకు దారితీస్తున్నాయని చర్చలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.

మహిళలు ఎదుర్కొంటున్న హింసను ప్రధానంగా శారీరక హింస, ఆర్థిక భారాలు, విద్యా-ఉద్యోగ అవకాశాల కోల్పోవడం వంటి మూడు రూపాల్లో వివరించారు. భద్రత కోసం అదనపు ఖర్చులు చేయాల్సి రావడం కూడా మహిళలపై పరోక్ష ఆర్థిక భారంగా మారుతోందని పేర్కొన్నారు.

చర్చలో పాల్గొన్న మహారాష్ట్రకు చెందిన విద్యార్థులు బహిరంగ ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, బాధితులనే నిందించే సామాజిక ధోరణి, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు జోక్యం చేసుకోకపోవడం వంటి సమస్యలను తమ అనుభవాల ద్వారా వివరించారు.

మహిళల భద్రతకు సంబంధించిన ఆందోళనలు వారి రోజువారీ జీవితాలపై కూడా ప్రభావం చూపుతున్నాయని చర్చలో పేర్కొన్నారు. భద్రతా భయాల కారణంగా కొందరు మహిళలు ఉన్నత విద్యను మధ్యలోనే వదిలేయడం, ఉద్యోగ అవకాశాలను కోల్పోవడం లేదా తమ ప్రయాణాలు, జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి వస్తోందని తెలిపారు.

మహిళలపై హింసను కేవలం వ్యక్తిగత సమస్యగా కాకుండా సామాజిక, వ్యవస్థాగత సమస్యగా చూడాల్సిన అవసరం ఉందని చర్చలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మహిళలకు సమాన అవకాశాలు, భద్రత, స్వేచ్ఛ కల్పించేందుకు కుటుంబాలు, విద్యా సంస్థలు, కార్యాలయాలు, ప్రజా వ్యవస్థల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని సూచించారు.