ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియాకు చెందిన మూడు విమానాలు దెబ్బతినడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటన ఆదివారం టెర్మినల్-2 వద్ద ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య చోటుచేసుకుంది.
అధికారుల వివరాల ప్రకారం, బలమైన గాలుల కారణంగా సమీప స్టాండ్ల వద్ద ఉంచిన గ్రౌండ్ సపోర్ట్ పరికరాలు, ఇతర వస్తువులు కదిలి పార్క్ చేసి ఉన్న ఎయిర్ ఇండియా ఏ320 విమానాలను ఢీకొన్నాయి. రెండు విమానాలు పలు చోట్ల దెబ్బతినగా, మరో విమానం కుడివైపు స్లైడింగ్ విండో కూడా దెబ్బతింది.
ఈ పరికరాలు ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ మరియు ఇండిగోకు చెందినవిగా అధికారులు తెలిపారు. ప్రస్తుతం మూడు విమానాలను తనిఖీలు, మరమ్మతుల కోసం గ్రౌండ్ చేశారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై డీజీసీఏ విచారణ కొనసాగిస్తోంది.












