రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో నిర్వహించనున్న కార్యక్రమంపై న్యూయార్క్ నగర మేయర్ జొహ్రాన్ మమ్దానీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి తాను మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.
ఆగస్టు 29న మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో సుమారు 5,000 మంది భారతీయ ప్రవాసులు పాల్గొనే కార్యక్రమంలో భగవత్ ప్రసంగించనున్నారు. అయితే ఇది ప్రైవేట్ కార్యక్రమం కావడంతో దాన్ని రద్దు చేసే అధికారం నగరానికి ఉందో లేదో తనకు తెలియదని మమ్దానీ తెలిపారు.
భగవత్ అమెరికా పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. RSS శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న గ్లోబల్ అవుట్రీచ్ కార్యక్రమంలో భాగంగా ఆయన అమెరికాతో పాటు కెనడా, బ్రిటన్లోనూ పర్యటించనున్నారు.
భగవత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలని పలు పౌర హక్కుల, అంతర్మత సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. Hindus for Human Rights, Indian American Muslim Council, Interfaith Centre of New York తదితర సంస్థలు ఈ కార్యక్రమంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.
భారత్ గురించి తన కుటుంబం ద్వారా తాను తెలుసుకున్నది బహుళత్వం, లౌకిక విలువలు, ప్రతి ఒక్కరికీ సమాన స్థానం కల్పించే సమాజం అని మమ్దానీ అన్నారు. మినహాయింపు ధోరణితో కూడిన ఉద్యమం పెరుగుతుండటం తనకు ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.
భారతీయ మూలాలున్న మమ్దానీ.. తాను న్యూయార్క్ చరిత్రలో తొలి ఇండియన్-అమెరికన్ మేయర్నని పేర్కొన్నారు. భగవత్ కార్యక్రమంపై తన వ్యతిరేకతను ఇండియన్-అమెరికన్గా, అలాగే ప్రతి ఒక్కరి హక్కులను గౌరవించే నగర మేయర్గా వ్యక్తం చేశారు.
మరోవైపు, AHEAD Forum ఆధ్వర్యంలో “Universal Oneness Celebration” పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచం ఒకే కుటుంబమనే సందేశాన్ని చాటడమే భగవత్ పర్యటన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
భారత్, హిందూ సమాజం, RSSపై వాస్తవికమైన, సానుకూల దృక్కోణాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే భగవత్ విదేశీ పర్యటన లక్ష్యమని RSS సంయుక్త ప్రధాన కార్యదర్శి సీఆర్ ముకుంద తెలిపారు.











