అమెరికాను కుదిపేసిన 2001 సెప్టెంబర్ 11 ఉగ్రదాడుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ దాడుల ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖలీద్ షేక్ మహమ్మద్ FBI అధికారులకు ఇచ్చిన కీలక స్టేట్‌మెంట్లను కోర్టు విచారణలో ఉపయోగించరాదని అమెరికా మిలిటరీ జడ్జి తీర్పునిచ్చారు.

2007లో FBI అధికారులకు ఇచ్చిన ఒప్పుకోలు స్వచ్ఛందంగా ఇచ్చినవిగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని ఎయిర్‌ఫోర్స్ లెఫ్టినెంట్ కల్నల్ మైఖేల్ శ్రామా తీర్పులో పేర్కొన్నారు.

ఈ నిర్ణయం గ్వాంటనామో బే మిలిటరీ కమిషన్‌లో వెలువడింది. దశాబ్దాలుగా సాగుతున్న ఈ కేసులో ప్రభుత్వ ప్రాసిక్యూషన్‌కు ఇది గణనీయమైన ఎదురుదెబ్బగా మారింది.

CIA కస్టడీ ప్రభావమే కారణమా?

ఖలీద్ షేక్ మహమ్మద్‌ను 2003లో పాకిస్థాన్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం CIA నిర్వహించిన రహస్య నిర్బంధ కేంద్రాల్లో ఆయనను ఉంచి తీవ్ర విచారణ పద్ధతులకు గురిచేశారు.

వాటిలో వాటర్‌బోర్డింగ్, దీర్ఘకాలిక ఒంటరితనం వంటి పద్ధతులు ఉన్నాయని కోర్టు రికార్డులు, దర్యాప్తుల్లో వెల్లడైంది.

2006లో ఆయనను గ్వాంటనామో బేకు తరలించారు. అనంతరం 2007 జనవరిలో FBI అధికారులు ఆయనను విచారించారు.

అయితే గతంలో CIA కస్టడీలో ఎదురైన తీవ్ర మానసిక ఒత్తిడి FBI విచారణ సమయంలో కూడా కొనసాగిందని జడ్జి శ్రామా అభిప్రాయపడ్డారు. CIA ద్వారా ఏర్పడిన ఒత్తిడి నుంచి ఆయన పూర్తిగా బయటపడినట్లు చెప్పేందుకు తగిన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది.

అదే సమయంలో FBI అధికారులు ఆయనకు నిశ్శబ్దంగా ఉండే హక్కు, న్యాయవాదిని సంప్రదించే హక్కు వంటి చట్టపరమైన హక్కులను స్పష్టంగా తెలియజేయలేదని కూడా జడ్జి గుర్తించారు.

అమెరికా ప్రాసిక్యూషన్‌కు భారీ ఎదురుదెబ్బ

ఖలీద్ షేక్ మహమ్మద్ 2007లో FBIకి ఇచ్చిన స్టేట్‌మెంట్లు ఈ కేసులో ప్రభుత్వానికి అత్యంత కీలకమైన ఆధారాల్లో ఒకటిగా ఉన్నాయి.

ఈ విచారణలు గత CIA విచారణలకు తగినంత దూరంగా జరిగాయని, FBI ముందు ఆయన స్వచ్ఛందంగా మాట్లాడారని ప్రాసిక్యూషన్ వాదించింది.

అయితే ఈ వాదనను జడ్జి అంగీకరించలేదు. స్టేట్‌మెంట్లు స్వచ్ఛందంగా ఇచ్చినవని నిరూపించాల్సిన ప్రమాణాన్ని ప్రాసిక్యూషన్ అందుకోలేదని తీర్పు చెప్పారు.

ప్రధాన మిలిటరీ ప్రాసిక్యూటర్ రియర్ అడ్మిరల్ ఆరోన్ సీ. రగ్ తీర్పును పరిశీలించిన తర్వాత అప్పీల్ చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఇప్పటికే దశాబ్దాలుగా కొనసాగుతున్న కేసు

ఈ తాజా తీర్పు వెలువడటానికి కొద్ది రోజుల ముందే జడ్జి శ్రామా.. ఖలీద్ షేక్ మహమ్మద్, మరో ముగ్గురు నిందితులపై విచారణను 2028 జూన్ 5న ప్రారంభించనున్నట్లు నిర్ణయించారు.

అయితే 9/11 కేసు ఇప్పటికే రెండు దశాబ్దాలకు పైగా న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకుంది. ముఖ్యంగా CIA కస్టడీలో జరిగిన విచారణలు, హింస, సేకరించిన ఆధారాలను కోర్టులో ఉపయోగించవచ్చా లేదా అనే అంశాలు కేసు పురోగతిని పదేపదే అడ్డుకున్నాయి.

ఖలీద్ షేక్ మహమ్మద్, ఇతర నిందితులు ప్రస్తుతం క్యూబాలోని గ్వాంటనామో బేలో నిర్బంధంలో ఉన్నారు. ఆరోపణలు రుజువైతే ఖలీద్ షేక్ మహమ్మద్‌కు మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది.

తాజా తీర్పుపై ప్రభుత్వం అప్పీల్ చేస్తే కేసు మరింత ఆలస్యం కావచ్చు. దీంతో 9/11 బాధితుల కుటుంబాలు, ఈ కేసులో తుది తీర్పు కోసం ఎదురుచూస్తున్నవారికి మరోసారి నిరీక్షణ తప్పకపోవచ్చు.