మేడ్చల్: ప్రియురాలి నాలుకను ప్రియుడు కోసిన సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కుషాయిగూడలో ఓ మహిళకు పది సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు. దీంతో ఒంటరిగా జీవనం సాగిస్తోంది. నవీన్ అనే వ్యక్తి పరిచయం కావడంతో ఇద్దరు మధ్య సానిహిత్యం పెరిగింది. ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. శుక్రవారం అర్థరాత్రి ఇద్దరు మధ్య గొడవ జరగడంతో తారాస్థాయికి చేరుకుంది. నవీన్ సహనం కోల్పోయి కత్తి తీసుకొని ఆమెపై దాడి చేశాడు. చాకుతో ఆమె నాలుకను కోయడంతో ఆమె కేకలు వేసింది. దీంతో నవీన్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. స్థానికులు వెంటనే ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.